Tuesday 7 March 2023

కాపిటలిస్టే కమ్యూనిస్టు కూడా కావచ్చు!


కేజీయఫ్ ఇండియా యూట్యూబ్ చానెల్ ద్వారా - వారం వారం చేస్తున్న ఇంటర్వ్యూలు దేనికదే అద్భుతంగా ఉంటున్నాయి. ముందుగా నా మిత్రులు మిట్టా సైదిరెడ్డి, భువనగిరి నవీన్ టీమ్‌కు నా అభినందనలు. 

కట్ చేస్తే -

ఇదే చానెల్లో తాజాగా నేను మొన్న చూసిన ఇంటర్వ్యూ శాంతా బయోటెక్ స్థాపకులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ఫిలాంత్రపిస్టు కె ఐ వరప్రసాద్ రెడ్డి గారిది మరొక లెవెల్లో ఉంది. 

వరప్రసాద్ రెడ్డి గారి ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు తెలియని వాస్తవాలు కొన్ని కొత్తగా తెలుసుకున్నాను. 

ప్రపంచస్థాయిలో వందల కోట్ల మందికి లాభాపేక్ష లేకుండా వాక్సీన్లను అందిస్తూ, మన దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిన శాంతాబయోటెక్ లాంటి ఒక సంస్థకు - 28 ఏళ్ళపాటు - తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందున్న ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నీటివసతిని కల్పించలేకపోయారు అన్న వాస్తవం నన్ను సిగ్గుపడేలా చేసింది. 

సేవా దృక్పథమే తన బ్రాండ్‌గా చేసుకున్న వరప్రసాద్ రెడ్డి గారు కాబట్టి... ఆయా ముఖ్యమంత్రులను, ప్రభుత్వాల్ని పెద్దగా పట్టించుకోకుండా... రోజుకు 250 లారీలతో నీళ్ళు తెప్పించుకొంటూ శాంతా బయోటెక్‌ను విజయవంతంగా నడిపి, ఎన్నో విజయాలను సాధించగలిగారు.

కాని, వేరే ఇంకొక ఇండస్ట్రియలిస్టు ఎవరైనా అయితే - "నాకు నీటి వసతే అందించని ఇక్కడ నేనెందుకు ఇంత కష్టపడాలి" అనుకొని తన సంస్థను మూసేసేవారు, లేదా అన్ని సౌకర్యాలూ అందించే ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోయేవారు. 

28 ఏళ్ళపాటు ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోని ఈ సమస్యను... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యక్తిగతంగా పట్టించుకొని... వారం వారం స్వయంగా కేసీఆర్ గారే వరప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ ద్వారా అప్‌డేట్ అందిస్తూ... కేవలం కొన్ని రోజుల్లోనే శాంతాబయోటెక్‌కు పైప్ లైన్ వేయించి నీటి సమస్యను పరిష్కరించడం ఒక రికార్డు.

ఈ నిజాన్ని ఇంటర్వ్యూలో వరప్రసాద రెడ్డి గారు చెప్పినప్పుడు నేను నిజంగా షాకయ్యాను. ఒళ్ళు గగుర్పొడిచింది. 

దటీజ్ కేసీఆర్!

ఒక ఇండస్ట్రియలిస్టుగా, ఒక ఫిలాంత్రపిస్టుగా, ఒక సంగీతసాహిత్యాభిమానిగా వరప్రసాద్ రెడ్డి గారి అత్యున్నత స్థాయి ఆలోచనలకు, కృషికి నేను అభిమానిని. 

హెపటైటిస్ బి వాక్సీన్‌తో పాటు, ఇంకో డజనుకు పైగా లాభాపేక్ష లేని వాక్సీన్ల సృష్టికర్తగా ఆయన రంగంలో ఆయనొక లెజెండ్. 

అలాంటి వరప్రసాద్ రెడ్డి గారు... ఇంకో లివింగ్ లెజెండ్, మన కళ్ళముందు మనం చూసిన 'ప్రపంచస్థాయి సక్సెస్ స్టోరీ' ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనను ఒక స్వర్ణయుగం అని చెప్పడం చాలా గొప్ప విషయం. 

కట్ చేస్తే - 

ఒకవైపు శాంతా బయోటెక్ ద్వారా ఎన్నో ప్రపంచ స్థాయి విజయాలు సాధించిన తర్వాత - ఇప్పుడు విశ్రాంత దశలో కూడా - సమాజం కోసం, తన చుట్టూ ఉన్న మనుషుల కోసం ఏదైనా చేయాలన్న నిరంతర ఆలోచనలతో ఇప్పటికీ నిరంతరం పనిచేస్తూ ఉండటం వరప్రసాద్ రెడ్డి గారొక్కరికే సాధ్యం. 

తన ఆధ్వర్యంలోని ఒక ఫౌండేషన్ ద్వారా... ఇప్పటికే 25 కి పైగా పుస్తకాలను వరప్రసాద్ రెడ్డి గారు ప్రచురించారన్న విషయం ఎంతమందికి తెలుసు?

హాస్యం, సంగీతం, సాహిత్యం వంటివి మనిషిని మనిషిలా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయని ఆయన గట్టిగా నమ్ముతూ,  ఆ దిశలో ఇప్పటికీ తనకు తోచింది ఏదో ఒకటి చేస్తుంటారంటే నమ్మశక్యంగా ఉంటుందా ఎవరికైనా? 

కాని... వారింకా ఇవన్నీ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. 

"పెట్టుబడిదారుడు కూడా సంపద పెంచవచ్చు, సంపద పంచవచ్చు" అని బాగా నమ్మటమే కాదు, చేసి చూపించిన "ఆచరణాత్మక కమ్యూనిస్టు" వరప్రసాద్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం రాకపోతుందా అని అప్పుడప్పుడూ అనుకునేవాణ్ణి.

కేజీయఫ్ ఇండియా యూట్యూబ్ చానెల్‌లో చూసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత - వరప్రసాద్ రెడ్డి గారిని ఎలాగైనా ఒకసారి కలవాలని... కొన్ని నిముషాలైనా వారితో ముచ్చటించాలనీ ఇప్పుడు గట్టిగా అనుకుంటున్నాను. 

No comments:

Post a Comment