Wednesday 19 September 2018

77 రోజులు

చాలా పెద్ద గ్యాప్ తర్వాత, మళ్లీ నాకత్యంత ప్రియమైన నా 'బ్లాగింగ్' మీద పడ్డాను.

జూన్ 29 నుంచి సెప్టెంబర్ 13 వరకు.

నిజంగా చాలా పెద్ద గ్యాప్.

బహుశా ఇంత పెద్ద గ్యాప్ ఇంతకుముందు నేనెప్పుడూ తీసుకోలేదు.

పనికొచ్చేదో, పనికిరానిదో .. మొత్తానికి ఏదో ఓ చెత్త, ఆ క్షణం నేను రాయాలనుకున్నది వెంటనే ఇక్కడ నా బ్లాగులో రాసేసేవాణ్ణి.

ఇదొక హాబీ. ఒక ఆనందం. ఒక థెరపీ. ఒక మెడిటేషన్.


కట్ టూ ఆ 77 రోజులు - 

అనుకోకుండా ఒక ప్రొఫెషనల్ టూర్.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు.

కేవలం ఒక 4 రోజుల పని అనుకున్నాను. కాని, అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల పనుల్లో ఊహించనివిధంగా కనెక్ట్ అవుతూ, అక్షరాలా 77 రోజులు ఉండాల్సి వచ్చింది!

మధ్యలో ఒకటి రెండు సార్లు కొన్ని గంటలకోసం అత్యవసరంగా హైదరాబాద్ వచ్చి వెళ్లినా, ఆ కొద్ది సమయం అసలు లెక్కలోకి రాదు.

1989 నుంచి 1991 వరకు, సరిగ్గా ఒక రెండేళ్లు, గుంటూరులోని మద్దిరాలలో ఉన్న కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ 'జవహర్ నవోదయ విద్యాలయ'లో నేను పనిచేశాను. ఆ తర్వాత, అక్కడ ఉద్యోగం రిజైన్ చేసి కర్నూలు ఆలిండియా రేడియోలొ చేరాను. తర్వాత, ఆ ఉద్యోగం కూడా రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చాను.

అది వేరే విషయం.

చెప్పొచ్చేదేంటంటే, నాకు గుంటూరుతో చాలా సంబంధబాంధవ్యాలున్నాయి. అప్పటి జ్ఞాపకాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

అప్పటి నవోదయ విద్యార్థుల్లో చాలా మంది ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. అప్పటి నా సహోద్యోగుల్లో కూడా కొందరం ఇప్పటికీ కలుస్తుంటాం. 

ఈ నేపథ్యంలో, గుంటూరు అంటే నాకు చాలా ఇష్టం.

అయితే, అప్పటి గుంటూరు వేరు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఇప్పటి గుంటూరు వేరు.

ఎక్కడ  చూసినా షోరూములు, జివెల్రీ షాపులు, కిక్కిరిసిన ట్రాఫిక్‌తో డెవలప్‌మెంట్ బాగానే ఉంది. కానీ, ఏదో సంథింగ్ మిస్ అవుతున్నానన్న ఫీలింగ్.

బహుశా, ఆనాటి సహజమైన 'టౌన్ ఫీలింగ్' అనుకుంటాను. అదిప్పుడు లేదు. 

నేను బాగా తిరిగిన అప్పటి గుంటూరే నాకిప్పటికీ ఇష్టం.

గుంటూరులో ఈ 77 రోజుల నా మొత్తం ట్రిప్‌లో నాకు బాగా నచ్చింది ఒక్కటే.

బ్రాడీపేటలో ఉన్న శంకర్‌విలాస్‌లో రవ్వదోశ. 

No comments:

Post a Comment