Saturday 2 December 2017

కొన్ని ఎప్పుడూ రొటీన్‌గా ఉండకూడదు!

అవును. కొన్ని ఎప్పుడూ రొటీన్‌గా ఉండకూడదు.

ముఖ్యంగా పుస్తకాలూ, పుట్టినరోజులూ.

హైద్రాబాద్‌కు సుమారు 660 కిలోమీటర్లదూరం, నిన్న, ఒక వ్యక్తిగతమైన పనిమీద వచ్చాను.

పనిలో పనిగా, ఇంతదూరం ఎలాగూ వచ్చానుకదా అని, కొన్ని వృత్తిపరమైన లింక్స్ కూడా ప్లాన్ చేసుకొని వచ్చాను. సమయం దొరికితే ఆ పనులు కూడా పూర్తిచేసుకోవచ్చని.

అయితే - ప్రధానంగా ఏ వ్యక్తిగతమైన పనిమీదయితే నేనిక్కడికి వచ్చానో, ఆ పని పూర్తికాలేదు. సోమవారానికి వాయిదా పడింది. ఇక, తప్పనిసరి పరిస్థితి కాబట్టి ఇక్కడే ఆగిపోవాల్సివచ్చింది.

ఒక హోటల్ రూమ్‌లో.

ఒంటరిగా నేను.

ఆదివారం. 

ఈ సిటీలో నాకు బంధువులు, మిత్రులు, అత్యంత ఆత్మీయ మిత్రులు చాలామందే ఉన్నారు. కానీ ముందే సమాచారం లేకుండా, ఈ ఆదివారం పూట అనవసరంగా వాళ్లల్లో ఏ ఒక్కరినీ డిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు.

రోడ్లమీదపడి తిరగడం, టైమ్‌పాస్‌కు సినిమాలకెళ్ళడం వంటివి నావల్ల కాని పని. నేనా దశదాటి దశాబ్దాలయ్యింది.

ఇక మిగిలింది ఏదైనా పుస్తకం చడవడం. లేదంటే, ఏదైనా రాయడం.

ఈ రెండే నాకత్యంత ప్రియమైన విషయాలు.

ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఒంటరిగా ఉండే అవకాశం ఏ కొంచెం దొరికినా - అయితే నావెంట తెచ్చుకున్న పుస్తకం చదువుతాను. లేదంటే, ఏదైనా రాస్తాను.

కానీ, ఇవాళ ఒక ప్రత్యేకమైన రోజు.

మామూలుగా ఎప్పట్లాగే రొటీన్‌గా ఎదో ఒక పుస్తకం చదవడమో, ఎదో ఒకటి రాయడమో కాదు. సంథింగ్ స్పెషల్ .. ఇంకేదైనా ఒక మంచి పని చేయాలనిపించింది.


కట్ టూ 'కె సి ఆర్ బుక్' - 

కె సి ఆర్ కేంద్ర బిందువుగా నేను రాసిన పుస్తకాన్ని అతి త్వరలో .. చెప్పాలంటే .. ఈ డిసెంబర్ లోపే .. ప్రింట్ చేసి, రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఆ పుస్తకంలో అక్కడక్కడా కొన్ని  మార్పులూ చేర్పులూ చేయాల్సి ఉంది. కొంత భాగం 'ఫైన్ ట్యూనింగ్' కూడా చేయాల్సి ఉంది.

వెంటనే - 'ఫస్ట్ ప్రూఫ్' కోసం ప్రింటవుట్ తీసిన ఆ పుస్తకం తాలూకు కాగితాల కట్టను బ్యాగ్‌లోంచి బయటకు తీశాను.

పూర్తిగా కె సి ఆర్ పుస్తకానికి సంబంధించిన ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాను ..

ఇప్పటిదాకా సీరియస్‌గా ఆ ట్రాన్స్‌లోనే పనిచేస్తూ కూర్చున్నాను. రాత్రి పడుకొనేవరకు కూడా ఇంక నాకదే పని.


కట్ చేస్తే - 

కేవలం రానున్న ఒక నెలరోజుల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మూడు అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈవెంట్స్ జరగనున్నాయి:

ఒకటి .. హైద్రాబాద్‌లో మెట్రో రైల్ ప్రారంభం. రెండోది .. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (GES2017). మూడోది .. ప్రపంచ తెలుగు మహాసభలు.

ఈ మూడూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కె సి ఆర్ ప్రతిష్టను మరింతగా పెంచేవే. ఇందుకు కె సి ఆర్ అన్ని విధాలా అర్హుడు.

మొన్నటిదాకా అత్యంత దారుణమైన నత్తనడక నడిచిన మెట్రోరైల్ మెడ మీద కత్తి పెట్టినట్టుగా ఇప్పుడొక ఖచ్చితమైన డెడ్‌లైన్ పెట్టారు కె సి ఆర్.

ఈ నెల 28 నాడు, ప్రధాని మోదీతో  హైద్రాబాద్ మెట్రోరైల్ ప్రారంభం చేయిస్తున్నారు కె సి ఆర్.

హైద్రాబాద్ మెట్రోరైల్‌కు కొన్ని ప్రత్యేకతలున్నాయి. మొదటిది: ఈ హైద్రాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యంత భారీదైన పబ్లిక్-ప్రయివేట్ వెంచర్. రెండోది: 35 మంది మహిళా లోకో పైలట్‌లు మన ఈ కొత్త మెట్రోరైల్ ను నడిపిస్తున్నారు.


కట్ చేస్తే -

ఇండియా - అమెరికా కాంబినేషన్‌లో .. సుమారు 150 దేశాలనుంచి, 1500 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్న "గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్", GES 2017, హైదరాబాద్ వేదికగా ఈ 28 నుంచి జరగబోతోంది.

ఈ సదస్సు జరపడానికి దేశంలోని 8 రాష్ట్రాలు పోటీపడ్డాయి. కానీ, ఆ అవకాశం తెలంగాణకే వచ్చింది. అలా రావడానికి కారణం కూడా "కె సి ఆర్ అండ్ టీమ్" సమర్థతే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

అమెరికా నుంచి ఈ సమ్మిట్‌కు వస్తున్న బ్రుందానికి స్వయంగా ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమార్తె కూడా అయిన ఇవాంకా ట్రంప్ నాయకత్వం వహిస్తుండటం ఒక పెద్ద విశేషం. కాదనలేని ఒక పెద్ద ఆకర్షణ.

ఈ సందర్భంగా, సమ్మిట్ జరిగే ఆ మూడు రోజులూ యావత్ ప్రపంచ దృష్టి, ప్రపంచ మీడియా దృష్టి హైద్రాబాద్ పైనే ఉండబోతోంది.

ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కె సి ఆర్ కు, హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రతిష్టను, గుర్తింపును తెచ్చేదే. ఆ గుర్తింపే రేపు మరిన్ని పెట్టుబడులు, మరింత సులభంగా హైదరాబాద్‌కు రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని ఉద్యోగాలు మన యువతకు, మరింత ఆదాయం మన రాష్ట్రానికి.

సహజంగానే, రాష్ట్ర ఐ టి శాఖ మంత్రి కె టి ఆర్ ఈ మొత్తం సమ్మిట్‌ను అత్యంత విజయవంతంగా నడపడంలో కీలకపాత్ర వహిస్తాడనడంలో సందేహంలేదు.

జరగబోయే గ్రౌండ్ రియాలిటీ చెప్పాలంటే - ఇవాంక, కె టి ఆర్ లు ఈ మొత్తం సదస్సుకు కేంద్రబిందువులవుతారు.


కట్ చేస్తే - 

హైదరాబాద్ వేదికగానే, డిసెంబర్‌లో ప్రారంభం కానున్న "ప్రపంచ తెలుగు మహా సభలు" ఈ సారి ఘనంగా, అద్వితీయంగా జరగనున్నాయి.

డబ్బులు మంచినీళ్లలా ఖర్చుపెట్టి, 'ఘనంగా', ఏ ముఖ్యమంత్రయినా ఏ మహాసభలనయినా నిర్వహిస్తాడు. సందేహంలేదు.

కాని, కె సి ఆర్ వేరు. 

పుస్తకాలతో, సాహిత్యంతో నిరంతరం సహచర్యం జరిపే వ్యక్తి కె సి ఆర్.

భాష విలువ తెలిసిన మనిషి కె సి ఆర్.

అన్నిటినీ మించి, మాతృభాషగా తెలుగును ఎలా గౌరవించాలో బాగా తెలిసిన మనీషి కె సి ఆర్.

ఆయన నేతృత్వంలో ప్రపంచ తెలుగు మహాసభలంటే ఏదో రొటీన్ ఆషామాషీ వ్యవహారం కాదని నా నమ్మకం.


కట్ టూ మై స్పెషల్ డే - 

ఇందాక ప్రారంభంలో చెప్పాను. వ్యక్తిగతంగా నాకు ఇవాళ ఒక ముఖ్యమైన రోజు అనీ, చిన్నదో పెద్దదో, ఈ సందర్భంగా ఇవాళ ఏదో ఒక మంచి పని చెయ్యాలనుకున్నాననీ. 

అవును .. ఈ రోజుని నేను వృధా చెయ్యలేదు.

సుమారు 14 ఏళ్లపాటు తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఒక వ్యక్తికి సంబంధించిన చిరుపుస్తకం పైన ఈరోజంతా పనిచేస్తున్నాను.

తెలంగాణ సాధన అనంతరం, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపొందించాలన్న తన ధృఢసంకల్పాన్ని కూడా మరో ఉద్యమంలా గత మూడున్నరేళ్లుగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక శక్తి గురించి రాస్తున్నాను.

ఈ రోజు వృధా కాలేదు.

ఈ రోజు నవంబర్ 26, నా పుట్టినరోజు.

***
(ఇది మొన్న నవంబర్ 26 నాడు రాసిన బ్లాగ్ . పోస్ట్ చేయడం ఆలస్యమయింది.)

No comments:

Post a Comment